కింగ్‌డావో చేరుకున్న ప్రధాని మోదీ

ఎస్సీవో వార్షిక సదస్సులో పాల్గోనున్న ప్రధాని

బీజింగ్‌,జూన్‌9(జనం సాక్షి ) : భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం చైనాలోని కింగ్‌డావోకి చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన కింగ్‌డావో వెళ్లారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉగ్రవాదం, అతివాదం ఎదుర్కోవడంతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపైనా నేతలతో చర్చించనున్నారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, చైనాతో ట్రంప్‌ సర్కారు ప్రచ్ఛన్న వాణిజ్య పోరుకు దిగడం వంటి పరిణామాల నడుమ కింగ్‌డావోలో జరిగే ఈ సదస్సు ప్రాధాన్యం సంతకరించుకుంది. ఐదు వారాల వ్యవధిలోనే మోదీ చైనా వెళ్లడం ఇది రెండో సారి. ఉహాన్‌లో ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో జరిగిన ఓ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం జరగనున్న ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవడం ఇదే తొలిసారి. ఈ బృందంలో భారత్‌, పాక్‌ శాశ్వత సభ్యులుగా నమోదైన తర్వాత జరుగుతున్న తొలి సభ ఇది. ఈ సమావేశానికి మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని, పాకిస్థాన్‌ అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ హాజరుకానున్నారు. ఈ సదస్సులో భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లైన ఉగ్రవాదం, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాల గురించి మోదీ మాట్లాడనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. 2001లో ఈ ఎస్సీవోను స్థాపించారు. రష్యా, చైనా, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. గతేడాది భారత్‌, పాకిస్థాన్‌కు ఈ సంస్థలో శాశ్వత సభ్యులుగా చోటు దక్కింది.