కూతురికి లైంగిక వేధింపులు : ప్రతిఘటనకు తల్లికి నిప్పు

ముంబై : కామాంధుల బారి నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళను ఇద్దరు మహిళలు మరికొందరితో కలిసి సజీవ దహనం చేయడారికి ప్రయత్నించారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. 90 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.
తన కూతురుని లైంగికంగా వేధిస్తున్నారని, ఇది చెప్పడానికి పోకిరీల కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లానని. అక్కడ ఇద్దరు మహిళలతో పాటు కొందరు నాతో వాగ్వాదానికి దిగారని. వారంతా నన్ను తీవ్రంగా కొట్టారని. అంతటితో ఆగకుండా కాల్చిచంపడానికి ప్రయత్నించారని కదలలేని స్థితిలో ఉన్న బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దాడి వెనక స్థానిక ఓ కాంగ్రెస్‌ నేత హస్తం ఉందని బాధితురాలు సీతాబాయ్‌ ఆల్కుంటే ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళలతో ఆల్కుంటే 20 ఏళ్ల కూతురు నిత్యం గొడవ పడుతూ వస్తోందని. ఈసారి గొడవ తీవ్రస్థాయికి చేరిందని పోలీసులు అంటున్నారు.
దాడికి పాల్పడిన మోనీ. సమన్‌లను పోలీసులు విచారిస్తున్నారు. మహిళపై దాడికి పాల్పడినవారిలో మహేష్‌ కాలే కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతన్ని కూడా తాము ప్రశ్నిస్తామని పోలీసులు అంటున్నారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.