రన్ వే పై విమానం బోల్తా

టొరంటో: కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మెుత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పియర్సన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగేందుకు వచ్చింది.

అయితే బలమైన గాలులు, రన్ వేపై మంచు కారణంగా ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి రవ్ వేపై దిగిన క్షణాల్లోనే తల్లకిందులైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భారీగా చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టాయి. మిన్నియాపోలిస్‌ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైందని పియర్సన్‌ ఎయిర్‌పోర్ట్ సంస్థ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో తెలిపింది. వాతావరణం అనుకూలించక ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.