మాధురీ దీక్షిత్‌ను కలిసిన అమిత్‌ షా..

కేంద్రం చేపట్టిన అత్యుత్తమ కార్యక్రమాల పుస్తకాన్ని అందజేత

ముంబాయి, జూన్‌6(జ‌నం సాక్షి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మంచి జోరువిూదున్నారు. ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా వరసపెట్టి ప్రముఖులను కలుస్తున్న కాషాయి నేత బుధవారం ముంబై చేరుకున్నారు. మొదటిగా బాలీవుడ్‌ నటి, ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ను కలిశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అత్యుత్తమ కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని మాధురి, ఆమె భర్త డాక్టర్‌ శ్రీరామ్‌ మాధవ్‌కు అందజేశారు. అమిత్‌ షా వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. స్వయంగా మాధురి ఇంటికి వెళ్లి కలిసిన అమిత్‌ షా.. వారితో కాసేపు ముచ్చటించారు. అయితే బుధవారం సాయంత్రం అమిత్‌సా శివసేన అధ్యక్షుడిని కలవనున్నారు.కాగా, 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాలు, సాధించిన విజయాలతో రూపొందించిన బుక్‌లెట్లను అందజేస్తున్నారు. పార్టీ శ్రేణులను 2019 ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ.. అమిత్‌ షా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ నివాసం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరవాత లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ తదితరులను కలిశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా అమిత్‌ షా 50 మంది మేధావులను (ఒపీనియన్‌ మేకర్స్‌) కలవనున్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 4000 మంది పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లక్ష మంది ప్రముఖ పౌరులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాల గురించి వివరించాలనేది లక్ష్యం. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ను కూడా అమిత్‌ షా త్వరలోనే కలుసుకోబోతున్నట్లు సమాచారం.
అమిత్‌షా వచ్చారని నాకు గృహనిర్భందం – కాంగ్రెస్‌ నేత నిరుపమ్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ముంబైలో పర్యటిస్తున్న సందర్భంగా తనను బుధవారం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ ఆరోపించారు. ‘ఉదయం నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు నా ఇంటి చుట్టు ఉన్నారు. నా బంగళా లోపలకు కూడా వచ్చారు. మేం ఈ రోజు ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు’ అని నిరుపమ్‌ విూడియాకు తెలిపారు. తన ఇంటి చుట్టూ ఎందుకు ఉన్నారని పోలీసులను అడిగితే.. తనపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారని అన్నారు. ‘మేం అమిత్‌ షాను ఘెరావ్‌ చేయడం.. లేదా ఆయన ముందు ఆందోళన చేస్తామని బీజేపీ భావించినట్టు ఉంది. అందుకు నన్ను ఉదయం నుంచి ఇంట్లోనే బంధించారు’ అని ఆయన అన్నారు. పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారని, అమిత్‌ షాకు భద్రత పేరిట తమ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.