క్షీణించిన మంత్రి ఆరోగ్యం..
– బలవంతంగా హాస్పిటల్కు తరలింపు
న్యూఢిల్లీ, జూన్18(జనం సాక్షి) : గతవారం రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్, ఆయనమంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అపాయింట్ మెంట్ కోరుతూ, ఆయన బంగ్లాలోనే దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. గత నాలుగు నెలల నుంచి ఐఏఎస్ అధికారులు విధులకు హాజరుకాకపోవడంతో పాలన సక్రమంగా సాగడం లేదని, ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఢిల్లీ సీఎం మనవి చేశారు. అయితే దీనిపై ఎల్జీ స్పందించలేదు సరికదా, వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో గత సోమవారం నుంచి కేజీవ్రాల్ మరో ముగ్గురు మంత్రులు అక్కడే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. తమ ముఖ్యమంత్రికి మద్దతుగా అక్కడే నిరాహార దీక్ష చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను బలవంతంగా ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం వరకూ ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా, రాత్రికి కీటోన్ స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. దీంతో తలనొప్పి ఎక్కువకాగా, శ్వాస తీసుకోవడంలో సత్యేందర్ జైన్ ఇబ్బందిపడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నామని డాక్టర్ జేఎస్ పాసీ వెల్లడించారు. మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టిన సత్యేంద్ర జైన్, తాము ఢిల్లీ వాసుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎల్జీ బంగ్లాలోనే కేజీవ్రాల్, మరో ఇద్దరు మంత్రుల దీక్ష కొనసాగుతోంది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, డయాబెటీస్ వైద్య నిపుణులు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ పాసీ తెలియజేశారు. ఆసుపత్రికి తరలించిన తరువాత జైన్ కోలుకుంటున్నారని కేజీవ్రాల్ ట్వీట్ చేశారు. అలాగే ఐఏఎస్ అధికారులు తమ మొండి వైఖరి వీడి విధులకు హాజరుకావాలంటూ కేజీవ్రాల్ కోరారు. ఇదిలాఉంటే సత్యేంద్ర జైన్ను ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెప్పారు. ఆరు రోజుల దీక్షలో ఆయన నాలుగు కేజీలు తగ్గారని తెలిపారు. ఐఏఎస్ అధికారుల సమ్మెకు వ్యతిరేకంగా, కేజీవ్రాల్ ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఆప్, వామపక్షాల కార్యకర్తలు దేశ రాజధానిలో సోమవారం మెగా ర్యాలీ నిర్వహించారు. తమ భద్రతపై ఢిల్లీ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేజీవ్రాల్ స్పందించారు. విూ భద్రతకు నాదీ పూచీ, ఎన్నుకున్న ప్రభుత్వానికి సహకరించాలని, మంత్రులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలని ట్వీట్ చేశారు.
గవర్నర్ ఇంట్లో ధర్నా చేసే అధికారం ఎవరిచ్చారు ?
ఢిల్లీ సీఎం కేజీవ్రాల్కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి జలక్ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ ఇంట్లో ధర్నా చేసేందుకు విూకెవరు అధికారం ఇచ్చారని హైకోర్టు సీఎం కేజ్రీవాల్ను ప్రశ్నించింది. గత వారం రోజులుగా కేజీత్రో పాటు ఆయన క్యాబినెట్లోని ముగ్గురు మంత్రులు గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారులు పనిచేయడం లేదని, ప్రధానితో పాటు గవర్నర్ కూడా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేజీ ధర్నా చేస్తున్నారు. అయితే దీనిపై సోమవారం రెండు పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. ఒకటి ఆమ్ ఆద్మీ నేత కేజీ వేయగా, మరొకటి ఐఏఎస్ల సంఘం వేసింది. విూకు గవర్నర్ ఇంట్లో ధర్నా చేసే అధికారం ఎవరు ఇచ్చారు. ఒకవేళ విూరు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే, అది ఆఫీసు బయట చేయాలని, కానీ ఒకరి ఇంట్లోకి వెళ్లి ఎలా ధర్నా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. కేజీ ధర్నా నేటితో 8వ రోజుకు చేరుకున్నది. అయితే మరో వైపు ఐఏఎస్ల సంఘం మాత్రం మరో వాదన వినిపిస్తున్నది. రాజకీయ లాభం కోసం తమను వేధిస్తున్నారని ఐఏఎస్లు ఆరోపిస్తున్నారు. దీక్ష చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను హాస్పటల్కు తరలించారు.