గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవ కలకలం

gujarah-03-oct-2016అహ్మదాబాద్‌,అక్టోబర్‌ 2(జనంసాక్షి): భారత సైన్యం జరిపిన దాడుల గురించి సర్వత్రా చర్చ జరుగుతుండగా భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చి ఓ పాకిస్థాన్‌ బోటు హల్‌ చల్‌ చేసింది. ఆదివారం గుజరాత్‌ సముద్ర తీరంలో భారత కోస్టు గార్డులు ఓ పాకిస్థాన్‌ బోటును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు.ఆదివారం ఉదయం 10.15గంటల ప్రాంతంలో ఐసీజీఎస్‌ సముద్ర పావక్‌ పాక్‌ బోటును గుర్తించిందని, ఆ వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ప్రాథమిక సమాచారం మేరకు అందులో ఉన్నవారంతా పాక్‌ మత్యకారులని తెలుస్తోంది. ఇటీవలె భారత్‌ సర్జికల్‌ దాడులు నిర్వహించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ ఏ సమయంలో నైనా ఏ రూపంలోనైనా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుందని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో గస్తీ దళం మరింత అప్రమత్తమైంది. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న తొమ్మిదిమంది పాకిస్థాన్‌ వాస్తవ్యులను పోరుబందర్‌ లో విచారించనున్నారు.