గ్రేటర్ ఎన్నికల మానిఫెస్టో ప్రత్యేకం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,డిసెంబర్11(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టిఆర్ఎస్ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో గ్రేటర్ అభివృద్ది తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నగరంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ను విశ్వనగరంగా ఎలా తీర్చిదిద్దబోతున్నది వివరిస్తామన్నారు. హైదరాబాద్ ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందన్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తుందని తెలంగాణ ఐటీ, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విూడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఐదు సర్వేలు నిర్వహించామని… సర్వేలన్నింటిలో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వెల్లడైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి… మేయర్ పీఠం దక్కించుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే జంటనగరాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. వివిధ రంగాల సెలబ్రిటీలతో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చితన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల సంఘం, సమాచార ప్రసారశాఖ ద్వారా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.