ఘనంగా తిరంగా ఉత్సవాలు

4

– మోదీ

న్యూఢిల్లీ,జులై 19(జనంసాక్షి): 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుస్కరించుకుని  ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు ‘తిరంగా ఉత్సవాలు’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో తిరంగా ఉత్సవాలు జరపాలని కోరారు. ఎంపీలందరూ పాల్గొని 70 ఏళ్ల స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల వారీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దేశభక్తి, దేశ నాయకుల జీవితగాథలను నేటి యువతకు చేరువ చేయాలన్నారు. 70 రకాల స్లైడ్స్‌ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్య్రంపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఆగస్టు 15 సందర్భంగా వారం రోజులపాటు తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల వారీ ప్రణాళిక రూపొందించాలని, గరీబ్‌ కల్యాణ్‌ అంత్యోదయ పథకాలకు ఎక్కువగా ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిన ప్రధాని, తిరంగా ఉత్సవాల నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు ఈ కార్యక్రమం దోహదపడగలదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.