ధరణిని అడ్డం పెట్టుకున్న భూకబ్జాకోరులను వదలిపెట్టం
` అందరి బాగోతాలను బయటపెడతాం
` ఫోరెన్సిక్ ఆడిట్తో సిద్దిపేట, సిరిసిల్లల్లో అక్రమాల గుర్తింపు
` త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్
` పోర్టల్ లొసుగుల వల్లే అక్రమాలు
` జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు
` ధరణి పోర్టల్ అక్రమాలపై ఉన్నతస్ధాయి కమిటీ నివేదిక
` మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినవారిని, రిజిస్టేషన్ల చలానా సొమ్మును కాజేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని, దీనిపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక నివేదికలో స్పష్టమైందని ఆయన తెలిపారు.ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ప్రకటించారు. శనివారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. విచారణలో ఎదురైన అంశాలు,ఎవరి పాత్ర ఎంత? తెరవెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాధమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని సూచించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటినుంచి 35వేల లావాదేవీలు జరిగాయని ఇందులో ప్రాధమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించడం జరిగిందని అయితే విచారణ తర్వాత 1109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు నాలుగు కోట్ల రూపాయిలు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందుచూపు లేకుండా ఒక కుట్రపూరితంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించి తొమ్మిది జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు పదివేల కోట్లు అని ఇంకొక్కరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదిలావుంటే ఇప్పటికే మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్లు జారీ చేయగా ఆదివారం నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో రెండు వేల మందికి లైసెన్స్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ లైసెన్స్డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ / రిజిస్టేష్రన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటిలిజెన్స్ అదనపు డిజి విజయ్కుమార్ ,ఉన్నతస్ధాయి కమిటీ సభ్యులు డిఐజీ ఎమ్. సుభాషిని, సిఎమఆర్వో మకరంద్, ఎసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ కైమ్ డిఎస్పీ ఎ. సంపత్, ఎనఐసి ప్రతినిధి శ్రీనివాస్ , హోంశాఖ సలహాదారు పి. శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



