ఘనంగా రాజీవ్‌ సద్భావన యాత్ర

3

కాంగ్రెస్‌ రాజీవ్‌ సద్భావన యాత్ర సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జనంసాక్షి):  రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఈ దేశ భవిస్యత్‌ను నిర్దేశించారని కాంగ్రెస్‌ నేతలు దిగ్విఆజయ్‌ సింగ్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులు అన్నారు. ఆయన దూరదృష్టి కారణంగానే ఇవాళ దేశం పురోగమిస్తోందన్నారు. చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావన యాత్ర సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి.  ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌, మాజీ కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్‌, జైపాల్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి, టి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజీవ్‌ సద్భావన అవార్డును గులాంనబీ ఆజాద్‌కు దిగ్విజయ్‌ సింగ్‌ ప్రదానం చేశారు.ఆర్‌ఎస్‌ఎస్‌,సంఘ్‌ పరివార్‌ పై కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రావణాసురుడికి పది తలలు ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ కు వంద తలలు ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.పాతబస్తీలో జరిగిన సద్బావన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రావణాసురుడిని మించిన దుష్టశక్తి అని ఆయన అన్నారు. సంఘ్‌ పరివార్‌ ను అంతా అడ్డుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద ప్రకటనలు చేసిన వారిని మందలించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. అదంతా బూకటమని అన్నారు. శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ ఎస్‌ వారు రిజర్వేషన్ల పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని,వారు సమాజానికి ప్రమాదంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో పొత్తు పెట్టుకోమని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలను అప్రతిష్టపాలు చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్రం చేస్తుందని మండిపడ్డారు.