చికిత్స కంటే నివారణే మార్గం

` వీధికుక్కల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు
` శునకాలవేనా .. కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా?
` కుక్క దర్గరకు వచ్చేంత వరకు అది కరుస్తుందో లేదో చెప్పలేం
` దేశవ్యాప్తంగా వీధిశునకాలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలి
` అధికారులను ఆదేశించిన ధర్మాసనం
న్యూఢల్లీి(జనంసాక్షి):వీధి కుక్కల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండడంపై అసహనం వ్యక్తం చేసింది. ‘‘అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే..ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు?వాటివి ప్రాణాలు కావా’’ అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ప్రశ్నించింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంతవరకు తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. రోడ్లు, పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తోన్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్‌ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. అయితే భారత్‌లో ఈ పద్ధతులను సరైన విధంగా పాటించకపోవడం, వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో వీటి బెడద తీవ్రమవుతోందన్నారు. జంతు సంక్షేమ ఎన్‌జీవోల తరఫున హాజరైన న్యాయవాది కాలిన్‌ గోన్సాల్వ్స్‌ వాదిస్తూ.. దేశంలో కుక్కకాట్ల సంఖ్యను ఉన్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయని ఆరోపించారు. కుక్క కాటు ఇంజెక్షన్‌ల సంఖ్యను కూడా సరైన విధంగా లెక్కించట్లేదన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్‌ కేసులు లేవన్నారు.