చీపురు పట్టిన ఫడణవిస్, బిగ్బీ
ముంబయి: మహారాష్ట్రను స్వచ్ఛ నగరాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం ‘మహా క్లీనథాన్’కి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్లో భాగంగా ముంబయిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్వయంగా చీపురు చేతబట్టిన ఫడణవిస్, అమితాబ్లు జేజే ఆసుపత్రి ప్రాంగణం, అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను ఏరివేశారు.
ఈ సందర్భంగా ఫడణవిస్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో 50 స్వచ్ఛ నగరాలను తీర్చిదిద్దుతామన్నారు.అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. తాము ఇక్కడికి ప్రసంగాలు ఇచ్చేందుకు రాలేదని, స్వచ్ఛ భారత్లో పాల్గొంటూ.. అవగాహన కల్పించేందుకే వచ్చామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ పాటుపడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ 10 గజాలు శుభ్రం చేసుకుంటే.. పూర్తి నగరం పరిశుభ్రమవుతుందని బిగ్బీ అన్నారు.