చెన్నై జలమయం
– తమిళనాట భారీ వర్షాలకు 150 మంది మృతి
– సహాయక చర్యల్లో మంత్రులు
చెన్నై, నవంబర్17(జనంసాక్షి):
గత వారం రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వారం రోజుల్లో 150 మంది మృతిచెందారు.చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. చెన్నై నగరం జలదిగ్బంధంలో మునిగిపోయింది. ప్రస్తుత భారీ వర్షాలకు కొన్ని చెరువులకు గండి పడటంతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో తమిళనాడు తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లోని జన జీవనం అస్తవ్యస్థం అయింది. చెన్నై మహానగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ జనసంద్రంగా మారింది.అదే సమయంలోప్రభుత్వం యంత్రాంగం బాధితులకు సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలించారు. వరద ముంపు ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు అధికారులు పర్యటించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరంలో ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందజేశారు. పట్టణంలో వరద బాధితులను ఆదుకోవాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పార్టీ కోశాధికారి స్టాలిన్ ఆదేశాలతో చేనేత కార్మికులు అధికంగా నివసించే పిళ్ళయారు పాళెయం, తిరుక్కాళి మేడు, పూంతోట్టం, పసుపు నీటి కాలువ ప్రాంతం, తాటితోపు, అల్లాబత్ చెరువు పరిధిలో పొయ్యాకొళం, చెవిలిమేడు తదితర ప్రాంతాల్లో సాయం పంపిణీ చేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి సన్బ్రాండు ఆర్ముగం, దక్షిణ జిల్లా కార్యదర్శి కె.సుందర్, రాష్ట్ర చేనేత విభాగం ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పటి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాధితులను పరామర్శించిన డీఎంకే నిర్వాహకులు వారికి రొ/-టటెలు, తిండికి కావాల్సిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.