జగన్ ఓ దొంగబ్బాయ్..
– హైకోర్టు సాక్షిగా దొర దొంగతనం బయటపడింది
– ట్విట్టర్ లో మంత్రి నారా లోకేశ్
అమరావతి, మార్చి4(జనంసాక్షి) : ఓటమి భయంతో దొంగబ్బాయ్ జగన్ కుట్రలు చేస్తున్నాడని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా జగన్, కేసీఆర్ల తీరుపై మండిపడ్డారు. మాకు సంబంధించిన డేటాను దొంగిలించడం ద్వారా ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ కు ఉన్న బ్రాండ్ పరువును తీశారని తెలంగాణ ప్రభుత్వంపై లోకేశ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ను దొంగబ్బాయని అన్నారు. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ను గుర్తు చేస్తూ, ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయడం రిటర్న్ గిఫ్ట్ అనుకున్నామని, కానీ, హైదరాబాద్ లో ఉన్న తమ డేటాను దొంగిలించారని ఎద్దేవా చేశారు. హైకోర్ట్ సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడిందన్నారు. తెల్లకాగితాలపై విఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారని తేలిపోయిందని అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారనుకున్నామని, కానీ విూరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.