జర్నలిస్టుల గొంతు నొక్కేస్తుండ్రు..

` దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ…
` ‘టార్గెట్‌’ నిజాయితీ గల పాత్రికేయులే..
` న్యూస్‌ క్లిక్‌కు నిధులొస్తున్నాయని ఆరోపణలు
` తీవ్రంగా ఖండిస్తున్న ఢల్లీి ప్రెస్‌క్లబ్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌
` కార్పొరేట్‌ల అవినీతి ఆరోపణలపై చర్యలేవంటూ ప్రశ్నలు
నేల మీద నిజం చెప్పే జర్నలిస్టులను ఇప్పుడు పాలకులు టార్గెట్‌ చేస్తున్నారు. దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. చైనా నుంచి న్యూస్‌ క్లిక్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌కు డబ్బులు వస్తున్నానే ఆరోపణలు చేస్తూ అభిసార్‌ శర్మ, భాషా సింగ్‌, ఊర్మిలేష్‌, ఠాకూర్‌, చక్రవర్తి ఇలా చాలా మంది సీనియర్‌ జర్నలిస్టుల ఇండ్ల మీద, కార్యాలయాల మీద పోలీస్‌లు దాడులు జరిపి, లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. జర్నలిస్టులను ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్నారు. హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. షాహిన్‌ భాగ్‌, రైతు ఉద్యమ వార్తల ను కవర్‌ చేసిన విషయాలను, అటు మణిపూర్‌ విషయాల కవరేజ్‌ ను కూడా మీరు చేసారా? అంటూ ప్రశ్నించారు.
ఎండి. మునీర్‌ (జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి): చైనా నుంచి న్యూస్‌ క్లిక్‌కు నిధులు వస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. యూఎపిఏ కేసులను వీరి మీద నమోదు చేశారు. సిపిఎం నేత సీతారాం ఏచూరి ఇంటిలో కూడా పోలీస్‌లు సోదాలు నిర్వహించారు. న్యూస్‌ క్లిక్‌కు కేవలం న్యూస్‌ కాంట్రిబ్యూట్‌ చేస్తున్న దేశ భక్తుడు, నిజం చెప్పే, ధైర్యవంతుడు అభిసార్‌ శర్మ లాంటి డేరింగ్‌, డాషింగ్‌ జర్నలిస్టుపై దేశ ద్రోహం కేసు పెట్టడం అన్యాయం. ఈ దాడులను ఢల్లీి ప్రెస్‌క్లబ్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిరచింది. గౌతమ్‌ అదాని లాంటి కార్పొరేట్‌ మీద వస్తున్నా, వచ్చిన ఒక్క ఆరోపణపై కూడా విచారణ లేదు. కనీసం వారి కంపెనీల మీద దాడి జరిపింది లేదు. గతంలో ఎలాంటి ఆరోపణలు రుజువు చేయలేక పోయిన పోలీస్‌లు జర్నలిస్ట్‌ సిద్దిక్‌ కప్పన్‌ను రెండు ఏండ్లు జైల్లో పెట్టారు. కేరళకు చెందిన ఛానల్‌ వన్‌ను బంద్‌ చేసారు. చివరికి సుప్రీం కోర్ట్‌ జోక్యంతో ఆ ఛానల్‌ మళ్ళీ ప్రారంభం అయ్యింది. అభిసార్‌ శర్మ లాంటి జర్నలిస్టును, రవిష్‌ కుమార్‌, పుణ్య ప్రసూన్‌ను ఎన్నో వేధింపులకు గురిచేయడం, బెదిరించడం, తప్పుడు ఆరోపణలతో ట్రోల్‌ చేయడం జరిగింది. దేశ ద్రోహులు అంటూ అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రచారం పెట్టారు. గౌతమ్‌ అదాని సోదరుడు వినోద్‌ అదాని ఫేక్‌ వ్యాపారం, షెల్‌ కంపెనీల, పెట్టుబడుల వ్యవహారం వెలుగు చూసినప్పటికీ చర్యలు లేవు.
విచారణ ఏజెన్సీల చర్యలేవీ..?
చైనాకు చెందిన చైన్‌ చుంగ్‌ లింగ్‌, నాసర్‌ అలీ లాంటి వారి లింకులు గౌతమ్‌ అదాని వ్యవహారంలో బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ విషయాలను రుజువులతో సహా బయట పెట్టినప్పటికి విచారణ ఏజెన్సీలు ఒక్కసారి కూడా చర్యలు తీసుకోలేదు. హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ మీద మౌనం వీడలేదు. నిజానికి ఒక చైనా మనిషి అదాని వ్యాపారంలో ఇన్వొల్వ్‌ కావడం నేషనల్‌ సెక్యూరిటీ విషయం కాదా? భారతదేశం రిప్యూటేషన్‌ విషయం ఇది! దేశంలోని పాలకులే ఇది నిజమా? అబద్దామా.. తేల్చి చెప్పాలి. నిజం మాట్లాడే, చెప్పే, రాసే, చూయించే హక్కు లేదు. దేశంలో మాట్లాడే స్వేచ్ఛ హరించబడుతున్నది. పౌరులకు మాట్లాడే స్వేచ్ఛ, తప్పును, తప్పు అనే హక్కు లేదు, ఇది ఇలా ఎంతకాలం?వందకు పైగా ప్రాంతాల్లో పోలీస్‌ లు మీడియా సిబ్బంది మీద రైడ్స్‌ చేయడం ఆందోళనకరం. చాలా కాలంగా దేశంలోని నిజం చెప్పే, చూయించే, రాసే పాత్రికేయుల మీద, మీడియా హౌస్‌లపైన కేసులు పెట్టడం జరుగుతున్నది. ముందు ఇలా ఒక డాక్యూమెంటరీ విషయంలో రిలే చేసారని బిబిసి మీద దాడులు చేశారు. అలా ప్రారంభం అయిన దాడులు, కేసులు పెట్టడాలు, మొన్న మణిపూర్‌ లో నిజనిర్దారణకు వెళ్లి వచ్చి రిపోర్ట్‌ ఫైల్‌ చేసిన ఎడిటర్‌ గిల్డ్‌ సభ్యుల మీద కేసులు నమోదు చేయడం, ఇప్పుడు అభిసార్‌ శర్మ తదితరుల మీద కేసులు, వారి ఇండ్ల మీద రైడ్స్‌ దేశంలో పాత్రికేయుల మీద దాడులు ఎంత పరాకాష్టకు చేరినాయో పరిస్థితి స్పష్టం చేస్తున్నది.
పీఎం విజ్ఞప్తి తర్వాతనే..
పీఎం నరేంద్ర మోడీ తన యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వారంలోపే, ఇలా ఇతర యూట్యూబర్స్‌ మీద దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో నిజాయితీ గల పాత్రికేయుల మీద ఉక్కుపాదం మోపుతూ, 2024 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి ఎవరు కూడా పాలక పార్టీకి వ్యతిరేకంగా నోరు తెరిచే పరిస్థితి ఉండవద్దనే కుట్రలో భాగమే ఇప్పుడు ఈ దాడులు, అరెస్టులు. దేశంలోని ప్రభుత్వ ఒడిలోని మీడియా ఇప్పటికే ఈ విషయాన్ని వక్రీకరించే పనిలో నిమగ్నం కావడం శోచనీయం. నేల మీది నిజంకు దోస్తుల్లారా.. ఇప్పటికైనా ఒక్కటి కండి. ఇప్పుడు కాకుంటే, మరెప్పటికి సాధ్యం కాదు. అబ్‌ తో అవాజ్‌ దో హమ్‌ ఏక్‌ హై..!!