జస్టిస్‌ కేశవరావు సేవలు మరువేనివి

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రబెల్లి
హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జస్టిస్‌ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ హబ్సిగూడలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి.. కేశవరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చారు. జస్టిస్‌ కేశవ రావు చిత్రపటానికి పూలు చల్లి శ్రద్దాంజలి ఘటించారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పేదలకు ఆయన అందించిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పెద్ద పెండ్యాల కు చెందిన కేశవరావు.. హన్మకొండ కాకతీయ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. వరంగల్‌ జిల్లాలో న్యాయవాద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1991లో హైదరాబాద్‌కు ప్రాక్టీస్‌ మార్చి, 1996లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగపరమైన కేసులు, ఎన్నికల కేసుల్లో పట్టు సాధించారు. ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2010లో సీబీఐ స్పెషల్‌ స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. అనేక సంచలన కేసుల్లో వాదనలు వినిపించారు. కేశవరావు.. 2017లో హైకోర్టు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు.