జాతీయ సమగ్రతను కాపాడండి

` భారత్‌ స్వయం సమృద్ధిని సాధిస్తోంది
` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు బుద్ధి చెప్పాం
` కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారు. వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సమర్థత వల్ల హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో కలిసింది. ఆపరేషన్‌ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం. పటేల్‌ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తాం. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. పటేల్‌ కలలుగన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటు-న్నారు. ఆర్టికల్‌ 370ని తొలగించి జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మనలో ఎన్ని విభేదాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాట. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలమంతా ఏకతాటిపైకి వస్తాం. ఇవాళ భారత్‌ అంటే సాదాసీదా దేశం కాదు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాం అని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన సైనికులు సత్తా చాటారు. ఉగ్రవాది మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులను హతమార్చాం. పహల్గాంలో మతం పేరు అడిగి మరీ చంపిన వారికి బుద్ధి చెప్పాం. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చాం. ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలేదు. ఇప్పుడు చిన్న పాజ్‌ మాత్రమే. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతుందని రాజ్‌నాథ్‌ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి రాజ్‌ నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. పటేల్‌ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు భారత్‌ ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, ఆర్టికల్‌ 370 తొలగించి జమ్ముకశ్మీర్‌ ను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. మనలో ఎన్ని భేదాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాటని, దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలంతా ఒక్కతాటికిపైకి వస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తో భారత్‌ శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసిందని ప్రశంసించారు. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చామని గర్వాన్ని వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని తెలుసుకోవాలని, ఇవాళ భారత్‌ అంటే సాదాసీదా దేశం కాదని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాం అని రాజ్‌ నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు పల్లెలపై పడి దోచుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామాలపై పడి హత్యలు, అత్యాచారాలు చేశారన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ముక్తి దివస్‌ చేసుకుంటే.. ఇక్కడెందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. పేర్లు మార్చి కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి పార్టీలు వేడుకలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మజ్లిస్‌కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఆపరేషన్‌ పోలోతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని వివరించారు. నిజాం నిరంకుశ పాలన తలచుకుంటే ప్రజల రక్తం మరుగుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఉర్దూను ప్రజలపై రుద్దేందుకు నిజాం ప్రయత్నించారన్నారు. బలవంతపు మతమార్పిడులు చేశారని.. మతం మారని వారికి ఎక్కువ పన్నులు వేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఓటు- బ్యాంకు రాజకీయాలతో రాష్ట్ర పాలకులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు-లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు.అంతకుముందు అసెంబ్లీ ముందున్న పటేల్‌ విగ్రహానికి కేంద్రమంత్రులు నివాళి అర్పించారు.