జియో ఆఫర్‌ను వెనక్కి తీసుకోవాలన్న ట్రాయ్‌

దిల్లీ: ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు ట్రాయ్‌ సూచించింది. ట్రాయ్‌ ఆదేశాలతో పూర్తిగా ఏకీభవిస్తామని జియో ప్రకటించింది. కొద్ది రోజుల్లోనే ట్రాయ్‌ సూచనలు పాటిస్తామని జియో పేర్కొంది. ఇది వరకే ‘సమ్మర్‌ సర్‌ప్రైజ్‌’ రీచార్జ్‌ చేసుకున్నవారికి మాత్రం ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.

వినియోగదారులంతా మార్చి 31లోపు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలని గతంలో జియో కోరింది. మెంబర్‌షిప్‌ తీసుకుంటేనే జియో అందిస్తున్న సదుపాయాలు వర్తిస్తాయని పేర్కొంది. మార్చి 31న జియో వెబ్‌సైట్‌, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందలేకపోయారు. దీంతో వినియోగదారుల ఒత్తిడి మేరకు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను 15రోజులపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించిది. అంతేకాకుండా కేవలం రూ.303కే మూడు నెలలపాటు ఉచిత కాలింగ్‌, రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చని కొత్త ఆఫర్‌ను ప్రకటించి మరింత మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.