జైపూర్‌ మ్యూజియంలో రజనీకాంత్‌ మైనపు విగ్రహం

జైపూర్‌, జూన్‌9(జనం సాక్షి ) : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి లెక్కకి మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను రజనీని అభిమానించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. రీసెంట్‌గా రజనీకాంత్‌ తాజా చిత్రం కాలా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీ విడుదల సందర్భంగా రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఉన్న సహార్‌ గఢ్‌ కోట మ్యూజియంలో రజనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బరువు 55 కిలోలు, ఎత్తు 5.9 అడుగులని మ్యూజియం డైరెక్టర్‌ శ్రీ వాస్తవ అన్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో అమితాబ్‌ బచ్చన్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయగా త్వరలో ఖాన్‌ త్రయం సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, ఆవిూర్‌ ఖాన్‌ల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేస్తారట. జైపూర్‌లోని సహార్‌ గఢ్‌ కోట మ్యూజియంకి దక్షిణ భారతదేశం నుండి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, టూరిస్టుల కోరిక మేరకు రజనీకాంత్‌ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీవాస్తవ అన్నారు. ఈ విగ్రహం తయారు చేసేందుకు శిల్పులు వ్యాంగ్‌ పింగ్‌, సుశాంత రే మూడు నెలల పాటు కష్టపడ్డారని అన్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల సంఖ్య 36 కాగా, ఇవి ఏర్పరచడానికి గల ముఖ్య కారణం ఇవి విజిటర్స్‌ని అలరించడమే కాక స్పూర్తిని కలిగిస్తాయి. ఇటీవల ఏర్పాటు చేసిన హాకీ స్టార్‌ సందీప్‌ సింగ్‌ విగ్రహం ఎందరికో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. బుల్లెట్‌ ప్రమాదం వలన అతని కెరీర్‌ నాశనం అయినట్టే అని అందరు భావించారు. కాని ఎగిసిపడే కెరటంలా మళ్ళీ పుంజుకొని ఇండియన్‌ హాకీని ఆయన అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడని వాస్తవ అన్నారు.