జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): జనగామ  జిల్లా దేవరుప్పుల మండల యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి, మండల రజక సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజుల నారాయణతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.  తెలంగాణలో గోదావరి జాలలతో పంట పొలాలకు నిరంతరంగా రెండు పంటలకు నీరందనున్నాయని ఎర్రబెల్లి అన్నారు.  వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వివరించారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో భారీగా తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని గ్రామస్తులంతా ఈ సందర్భంగా తెలియజేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని  గిరిజన తండాలలో జలగం వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు.  నియోజకవర్గంలోని చుంచుపల్లి మండలం నందా తండా, సర్వారం తండాలలో బుధవారం ఉదయం నుంచి ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు. అవకాశవాదాలను, అబద్దాల కోరును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మహా కూటమి అనైతిక బంధమన్నారు. నాడు కాంగ్రెస్‌ను తరిమేసేందుకే ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేస్తే నేడు మళ్లీ అదే పార్టీతో పొత్తు పెంటుకుంటారా అని ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారని స్పష్టం చేశారు. నకిరేకల్‌ మండలం పాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన 100 మంది యువకులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ ఎల్కతుర్తి మండలం కేషవాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు.