టీచర్లు పాఠాలే చెప్పాలి: సుప్రీం

5దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. ఉపాధ్యాయులు.. ప్రజాప్రతినిధుల వద్ద పీఏ, పీఎస్‌లుగా కొనసాగేందుకు వీల్లేదని.. అది చట్ట విరుద్ధమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించగా… అలాంటి విధానం ఎక్కడా లేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో ఉపాధ్యాయులను వారంలోగా పాఠశాలలకు కేటాయించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ తరహా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులంతా అక్టోబర్‌ 1 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించింది.

దీనిపై స్పందించిన ఉపాధ్యాయులు.. కోర్టు ఆదేశంతో తమ పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని విన్నవించారు. అయితే వారి పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.