ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ విజయశాంతి కూడా వెళ్లారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై వారం రోజులైన విషయం విదితమే. అయితే మంగళవారం నుంచి వారు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కానున్నారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించే విషయంపై యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లుపై ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో ఓటింగు జరిగే అవకాశం ఉంది. ఈ ఓటింగ్‌లో పాల్గొనేందుకు వారు ఢిల్లీకి వెళ్లారు. ఎఫ్‌డీఐ బిల్లుపై జరిగే ఓటింగ్‌లో పాల్గొని ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా వారు ఓటు వేయనున్నారు.