ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట..
18 మంది మృతి
పలువురు తీవ్రంగా గాయలు
ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
న్యూదిల్లీ రైల్వేస్టేషన్లో కుంభమేళా కు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై స్పందిం చిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్కు భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన 14, 15 ప్లాట్ఫాంలపై జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ క్రమంలో 14వ నంబరు ప్లాట్ఫాంపై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో, 18 మంది మృతిచెందారు.
న్యూదిల్లీ రైల్వేస్టేషన్లో కుంభమేళా కు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైల్వేశాఖ నిర్లక్ష్యంతోనే అది చోటుచేసుకుందని విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో బాధించిందని రాహుల్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వేశాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ‘ఇది తీవ్ర విషాదకరం. అక్కడి నుంచి వచ్చిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. కేంద్రం పర్యవేక్షణలో, దేశ రాజధానిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే. మరణించిన, గాయపడినవారి ఖచ్చితమైన గణాంకాలు ఎప్పుడు తెలుస్తాయి?. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కుంభమేళా నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సైతం ఇలాంటి ఆరోపణలు చేశారు. కుంభమేళాకు వెళ్లేందుకు దిల్లీ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు పోటెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 18 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు 12, 13, 14 ఫ్లాట్ఫాంలపై వేచిఉన్నారు. అదే సమయంలో 14వ నంబరుపై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలవడం ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. దీనిపై దిల్లీ పోలీసులు అధికారికంగా విచారణ చేస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలు తెలుసుకునేందుకు రైల్వేస్టేషన్లోని సీసీటీవీలను పరిశీలిస్తునట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు పిల్లలు సహా 15 మంది చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల, గాయపడ్డ వారి కుటుంబాలకు ఓదార్పు అవసరమన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు ఉత్తమమైన యంత్రాంగం అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.