తడబాటు లేని …నా నాలుగేళ్ల తెలంగాణ !

నాలుగేళ్లు గిర్రున తిరిగాయి. గతంలో అనేక ఏళ్లు కూడా ఇలాగే గిర్రున తిరిగాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటన్నదే ఇప్పుడు కొలమానం. గత ఏడు దశాబ్దాల కాలానికి ప్రస్తుత నాలుగేళ్ల కాలనానికి ఉన్న తేడాయే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందన్నదే ముఖ్యం.. ఏమైనా మార్పు కనిపించిందా అన్నదే కావాలి. గతంలో జరగని అద్భుతాలు లేదా కార్యాలు ఏవైనా జరిగాయా అన్నదే కావాలి. ఒకవేళ అలా జరిగివుంటే వాటి ఆధారాంగానే తెలంగాణ ఏర్పాటు వల్ల జరిగిన కార్యాలుగా గుర్తించాలి. ప్రధానంగా ఈ నాలుగేళ్లలో విద్యుత్‌ సమస్యను అధిగమించాం. అది కొని ఇస్తున్నారా..లేక దొంగతనం చేసి ఇస్తున్నారా అన్నది అప్రస్తుతం. ఎందుకంటే కరెంట్‌ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు,పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత తెలంగాణ వల్లభుడైన కెసిఆర్‌దే. నడిబజార్‌లో నిలబడి ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత నాలుగేళ్ల కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. పదేళ్లలో చేయలేనివారు రేపు వచ్చి ఏమో చేస్తామని ప్రజలను మభ్యపెడితే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు. ఎందుకంటే కనిపిస్తున్న అభివృద్దిని తక్కువ చేసి, లేనిపోని భ్రమలు కల్పిస్తే ఎలా నమ్ముతాం. ఎందుకంటే గత పదేళ్ల వారి పాలనా కాలమే ఇందుకు గీటురాయిగా తీసుకోవాలి. ఈ నాలుగేళ్లో అన్నీ అద్భుతాలు జరిగాయని సిఎంగా కెసిఆర్‌ కూడా చెప్పడం లేదు. అయితే తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి. ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయి. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 31 జిల్లాలో చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది. ఆశలను కల్పించడం వేరు.. వాటిని సాకారం చేయడం వేరు. తెలంగాణ కలను సాకారం చేసిన వ్యక్తిగా ధీరోదాత్త నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా కెసిఆర్‌ నిలిచిపోతారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హావిూని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు భాగస్వాములైతే తెలంగాణ పురోభివృద్దిలో కీలకం కానుంది. ఇక మరో విశేషమేమంటే సమైక్య రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక పథకాలను,చట్టలాను మార్పు చేసుకుంటే తప్ప తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా సాగడం అన్నది కెసిఆర్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముఖ్యమైనవి. ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగనుంది. దేశానికి ఈ పథకం ఆదర్శం కాబోతున్నది. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల రూపు రేఖలను మార్చి పేదల ఇళ్లకు కొత్త అర్థం చెప్పారు. చెప్పడమే కాదు చేసి చూపారు. పేదలు కూడా గౌరవంగా బతికేలా చేశారు. రెండు పడకగదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. తమకూ అటువంటి ఇళ్లు రాబోతున్నయన్న ఆనందంలో ఉన్నారు. రానున్న ఏడాదిలో ఈ కలను సాకారం చేస్తామన్న హావిూ ఇప్పుడు పేదలకు సంజీవినిగా మారింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఉద్యోగాల భర్తీ పక్రియనూ సర్కారు వేగవంతం చేసింది.ఒకేసారి 21కొత్త జిల్లాలు ఏర్పాటై మొత్తం 31 జిల్లాలతో అలరారుతున్న తెలంగాణ కోటి రతనాల వీణగా భాసిల్లాలంటే అందుకు కావలసిన సంకల్పబలం సమకూర్చుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి పేదలకు వరంగా నిలిచాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ కానుంది. నాలుగేళ్లుగా మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగుతోంది. ఇది పక్కాగా అమలయితే తెలంగాణ హరిత తెలంగాణ కావడం ఖాయం. ఇకపోతే రైతులకు గతంలో దేశంలో ఎక్కడా చేయని పనులు చేసి వారికి ఆత్మబందువుగా నిలిచారు. నిరంతర విద్యుత్‌,నీటి సరఫరా, ఎరువుఉల విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎక్రాకు 8వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలుగానే చూడాలి. ఇక ఇంటింటిక మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ పనులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీనికి రూ.42వేల కోట్లు ఖర్చవుతుంది. నీరివ్వకుంటే ఓట్లు అడగనని ఘంటాపథంగా చెప్పారు. ఇక గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ఇలా గత నాలుగేళ్ల కాలంలో కళ్లకు కనిపించే అనేక పథకాలను సాకారం చేశారు.చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే మొడి ధైర్యం కెసిఆర్‌ది. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి ఈ పనులు కనువిప్పు కావాలి. విమర్శకులకు కూడా ఇవి చెంపపెట్టు కావాలి. తెలంగాణను రాత్రికి రాత్రే మార్చేందుఎకు మంత్రదండం లేకున్నా గుండె ధైర్యం మాత్రం కెసిఆర్‌కు బోలెడంత ఉంది. అది చాలు రానున్న కాలంలో తెలంగాణ స్వరూపస్వభావాలు మారుతాయనడానికి.