తాంత్రికుడి సలహాతో కూతురున్ని చంపేశారు

– యూపీలో దారుణ ఘటన
లక్నో, ఆగస్టు7(జ‌నంసాక్షి) : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఉన్న కూతుర్ని చంపాలని ఓ తాంత్రికుడు ఇచ్చిన సూచనతో సొంత తల్లిదండ్రులే దారుణానికి ఒడిగట్టారు. కన్న కూతురినే హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని చౌదర్‌పూర్‌ అనే గ్రామంలో చోటుచేసుకుంది. తాంత్రికుడు చెప్పాడని తమ ఆరేళ్ల కూతురు తారాని చంపేశారు. తమకు తర్వాత పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యంతో బాధపడుతున్న పాపను చంపేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాలని ఓ తాంత్రికుడు చెప్పడంతో తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. పాప విషయంలో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇంట్లో తవ్వడంతో మృతదేహం బయటపడింది. పాపకు ఎన్నో మందులు వాడాము, అవేవీ పనిచేయలేదు అంతేకాకుండా ఇంకా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. నా మనవడికి కూడా ఎముకలు వంకర్లు పోయే వ్యాధి వచ్చిందని తార బామ్మ వెల్లడించారు. తారకు పోషకాహార లోపంతో పాటు ఎముకలు వంకర్లు తిరిగే వ్యాధి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. చిన్నారిని ఊపిరాడకుండా చేసి చంపేశారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. పాప తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.