తాడిచర్ల ఏఎమ్మార్ ఓసిపిలో లారీ ఢీ కొని కార్మికుని మృతి

ఏఎమ్మార్ నిర్లక్ష్యం వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం
సంఘటన స్థలానికి చేరుకున్న కాటారం డిఎస్పీ బోనాల కిషన్
మల్హర్, జనంసాక్షి
మండల కేంద్రంలోని తాడిచర్లలో ఏఎమ్మార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్న ఓసిపి బ్లాక్ 01 మైన్ లో ఆదివారం తెల్లవారుజామున బ్లాస్టింగ్ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్న అర్ని ధశరథం (48) అనే కార్మికుడు బొగ్గు లారీ డీ కొని అక్కడికక్కడే మృతి చెందిన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అర్ని ధశరథం తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో బ్లాస్టింగ్ సెక్షన్ లో హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే ఢ్యూటికి వెళ్తున్న క్రమంలో ఓసిపి కోల్ యార్డు సమీపంలోని టర్నింగ్ వద్ద టిఎస్ 25 టి 3737 అనే నంబర్ గల లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అత్యంత వేగంగా వచ్చి ధశరథం బైక్ ను డి కొట్టింది తలకు బలమైన గాయం కావడంతో ధశరథం అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు మైన్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి పై దాడి చేశారు. అనంతరం మృతదేహాంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న కాటారం డిఎస్పీ బోనాల కిషన్, సిఐ రంజిత్ రావు, కొయ్యూరు ఎస్ఐ తనుగుల సత్యనారాయణ లు సంఘట స్థలానికి చేరుకుని సల్ఫ లాటీ చార్జీ తో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ఏఎమ్మార్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం నెలకొందని ఏఎమ్మార్ అధికారులపై మండిపడ్డారు. కోల్ యార్డు సమీపంలో ప్రతి నిత్యం బొగ్గు లారీలు తమ సీరియల్ నంబర్ల కోసం వేగంగా వస్తున్నాయని సమీపంలో సెక్యూరిటీ గేట్ ఏర్పాటు చేయాలని అలు మార్లు విన్నవించినా ఫలితం లేక పోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఎమ్మార్ అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులు మరణించిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మృతదేహం తో కంపెనీలో కోల్ యార్డు సమీపంలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దిగివచ్చిన ఏఎమ్మార్ యాజమాన్యం రూ 45 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జరిగిన సంఘటన పై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.