తెలంగాణపై ఈ నెల 20న చర్చిస్తాం

వాయలర్‌ రవి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి):
తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్‌ రవి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో అధిష్టానం చర్చిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎంపీ మధుయాష్కీ వివరించారని చెప్పారు. మిగిలిన ఎంపీలతో కూడా తాము చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఎంపీల సెంటిమెంట్‌ను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. అక్కడ ప్రజల నుంచి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని చెప్పారు. తెలంగాణ డిమాండ్‌ను తిరస్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు.