తెలంగాణ ఆకాంక్షలను వమ్ము చేశారు: గాదె ఇన్నయ్య

సిద్దిపేట,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణజనసమితి పోలిట్‌ బ్యూరో సమితి సభ్యుడు గాదె ఇన్నయ్య అన్నారు. పేదవాడికి అండగా అన్ని తరగతుల వారికి సంక్షేమ ఫలాలు అందించే విధంగా పాలన సాగించాల్సిన టిఆర్‌ఎస్‌ అవినీతి కుటుంబ పాలనగా మారిందన్నారు. కెసిఆర్‌ పాలనతో విసిగిన అనేకులు టిజెఎస్లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణను బలిదానాలతో తెచ్చుకున్నామని అన్నారు. ముఖ్యంగా ఎన్నో ఉద్యమాలకు కీలకంగా నాయకత్వం వహించి తెలంగాణ రావడానికి ముఖ్య భూమికగా కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి ప్రజల్లో దూసుకుని పోతోందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి లాంటి ఎన్నో వాగ్దానాలు చేసి మాట తప్పిన ప్రభుత్వంగా టిఆర్‌ఎస్‌ పార్టీ నిలిచిందని అన్నారు. ఈ నెల 22 వతెదిన తెలంగాణ జనసమితి పార్టీ అద్వర్యంలొ దుబ్బాక బాలాజి గార్డెన్‌ ఫంక్షన్‌లో కొదండరాం సమక్షంలో చిందం రాజుకుమార్‌తో పాటు వందలాది మంది కార్యకర్తల సంఖ్యతొ పార్టీ లొ చేరికలు ఉంటాయన్నారు