తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

` ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే.. ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం సిఎం రేవంత్‌ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం మంత్రులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తరవాత గవర్నర్‌తో సిఎం, మంత్రులు గ్రూప్‌ ఫోటో దిగారు. ఆ తదుపరి హై టీలో విఐపిలు పాల్గొన్నారు. 1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్‌ వర్మ.. త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్టాన్రికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్‌గా రావడం విశేషం. కాగా అంతకుముందు జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో జిష్ణుదేవ్‌ శర్మ దంపతులకు సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో పాటు డీజీపీ జితేందర్‌ ఘన స్వాగతం పలికారు. అలాగే త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఇతర ఉన్నత అధికారులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్‌ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్‌గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణ వ్యవహరించిన విషయం తెలిసిందే. రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది.