తెలంగాణ సాధిస్తేనే నిజమైన నివాళి : కోదండరామ్‌ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) :

తెలంగాణ సాధిస్తేనే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ప్రదర్శన తీశారు. అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 900 మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని తెలిపారు. ప్రజల న్యాయమైన డిమాండ్‌ తీర్చమంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ పార్టీలతీతంగా జేఏసీ నిర్మాణంపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించబోయే జేఏసీ సమావేశంలో ఉద్యమ కార్యాచర ప్రకటిస్తామని తెలిపారు.