దొంగతో పోరాడి రైల్లోంచి పడ్డ మహిళా ఎస్ఐ

గుణ: కేంద్ర పారిశ్రామిక భద్రత దళానికి (సీఐఎస్ఎఫ్‌) చెందిన మహిళా ఎస్ఐ సుమన్ దాగర్ ఓ దొంగ నుంచి పర్సును రక్షించుకునే క్రమంలో రైల్లో నుంచి కిందకు పడిపోయారు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఓ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అజ్మీర్ నుంచి జబల్పూర్కు వెళ్లేందుకు దాగర్ రైల్లో ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రుతియా జంక్షన్ సమీపంలో ఆమె తన వస్తువులను తీసుకుని కంపార్ట్మెంట్ డోర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఓ యువకుడు దాగర్ పర్సు లాక్కొనేందుకు ప్రయత్నించాడు. ఆమె పర్సు కాపాడుకునేందుకు దొంగతో పోరాడే క్రమంలో రైల్లో నుంచి కిందకుపడగా, దొంగ పర్సు తీసుకుని పారిపోయాడు. పర్సులో 5 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్, విలువైన పత్రాలు ఉన్నట్టు గుణ రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.