దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త
వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం
హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి):
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సమస్యను దోశతో పోల్చిన కేంద్ర మంత్రి వాయ లర్‌ రవిని ఏకిపడేశారు. బలిసి అలా మాట్లాడు తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఆర్టీసీ మహిళా ఉద్యోగుల కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలను కాం/-గరెస్‌ నేతలు అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలకు మతిభ్రమించి ఉద్యమాని కించపరిచేలా మాట్లాడుతున్నట్లు ఉందని విమర్శించారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం దోశ వేసినంత తేలిక కాదని కేంద్ర మంత్రి వాయలర్‌ రవి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనకు అలా మాట్లాడడానికి తెలివి ఉండాలన్నారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి.. అంతే కానీ, దోశ, వడ అంటూ వాయలర్‌ రవి అవమానకరంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దోశ గిశ అంటే తెలంగాణ మహిళలు కాంగ్రెస్‌ పార్టీని దోశ పిండిని రుబ్బినట్లు రుబ్బుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్‌ విరుచుకు పడ్డారు. వారు సన్నాసులు అని, వారికి పౌరుషం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా.. ఇంకా ఆ పార్టీని పట్టుకొని వేలాడమేమిటని ప్రశ్నించారు. వాయలర్‌ రవి దోశ గీశ అంటే ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆర్టీసీలో మహిళా పోస్టులను వారికే కేటాయించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
వెంటనే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబునాయుడేనని.. కాంట్రాక్ట్‌ విధానాన్ని అమలు చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కార్మిక చట్టాల కింద కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.