నాగదోషం పేరుతో భయపెట్టి బంగారు నగలతో ఉడాయించిన దొంగలు

నెల్లూరు : మానవ విజ్ఞానం అంతరిక్షం వైపుకు దూసుకు పోతున్నా కొంతమంది మనుషుల్లో మూఢ నమ్మకాలపై విశ్వాసం సన్నగిల్లడం లేదు. చిలక జోస్యాలు, సోది చెప్పే వారిని అమాయకంగా విశ్వసిస్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దుండుగులు చిలకజోస్యం, సోది వంటి రకరకాల పేర్లతో మహిళలను మోసం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని చిల్లకేరు మండలం చింతవరంలో ఇద్దరు యువకులు చిలకజోస్యం చెబుతామంటూ ఇంట్లోకి ప్రవేశించి నాగదోషం ఉందని ఆమెను భయపెట్టి బంగారు నగలతో ఉడాయించారు. అయితే, సమయానికి స్థానికులు వీరిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఇదే మండలంకు చెందిన బోధనంలో మరో వ్యక్తి సోది చెబుతానంటూ ఇంట్లోకి ప్రవేశించి మహిళ వద్ద నుంచి బంగారు నగలు అపహరించిన ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది.