నానా పాల్కర్‌ శతాబ్ది ఉత్సవాలకు టాటా

ముంబై,జూలై10(జ‌నం సాక్షి ): నాగపూర్‌లో ఇటీవల జరిగిన రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో వేదికపంచుకోగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కూడా ఇలాంటి కార్యక్రమంలనే పాల్గొనబోతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆగస్టు 24న ఏర్పాటు చేయనున్న కార్యక్రమానికి రతన్‌ టాటా హాజరుకానున్నారు. మోహన్‌ భగవత్‌తో వేదికను పంచుకోనున్నారు. వీరురువురూ ముంబైలోని నానా పాల్కర్‌ స్మృతి సమితి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సంఘ్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. నానా పాల్కర్‌ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఆగస్టు 24న జరుగనుంది. ఇందులో టాటా పాల్గొన బోతున్నారు. సంఘ్‌ ప్రచారక్‌ నానా పాల్కర్‌ పేరిట ఈ ఎన్జీఓ ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలోని టాటా మెమోరియల్‌ ఆసుపత్రి ఎదుట ఉంది. కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు సమితి సేవలందిస్తోంది. రతన్‌ టాటాకు తమ సంస్థ కార్యకలాపాల గురించి అవగాహన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి తెలిపారు.