నిజాయితీకే పట్టం

హైకోర్టు ఆదేశాల మేరకు అధికార పీఠంపై చిలక టోన్ పల్లి సర్పంచ్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 25 (జనంసాక్షి)

గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిందన్న అభియోగంపై సస్పెండ్ అయిన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిలకటోన్ పల్లి గ్రామ సర్పంచ్ పద్మ సోమవారం తిరిగి తన సర్పంచ్ పదవిని చేజిక్కించుకుంది.గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిందన్న అభియోగంపై ఇటీవల వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి సర్పంచును సస్పెండ్ చేశారు.ఈ సస్పెండ్ ను సవాలు చేస్తూ సర్పంచ్ పద్మ హైకోర్టును ఆశ్రయించింది
పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఆమె సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్టే ఆర్డర్ ను జారీ చేసింది.దాంతో సోమవారం సర్పంచ్ తన పదవిని మళ్ళీ చేజిక్కించుకుంది
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అధికారులు, అధికార పార్టీ నాయకులు తనపై ఉన్న విద్వేషంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని నిజాయితీగా పనిచేసిన తనను ఎవరు కూడా ఏం చేయలేరని ఆమె పేర్కొన్నారు రాత్రికి రాత్రి జీవోలను పాస్ చేయించి తమతో పని చేయించిన అధికారుల ఆదేశాల మేరకే తాను గ్రామపంచాయతీ నిధులను ఉపయోగించానని.ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోయినా తన సొంత నిధులు వెచ్చించి, అప్పులు చేసి,తన, తన కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న ఆభరణాలను సైతం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేసిన తమకు అధికారులు ఇచ్చిన గౌరవం ఒక సస్పెన్షన్ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసే అధికారులు నిధులు ఎందుకు మంజూరు చేయరని నిధులు మంజూరు చేయకుండా మాతో పనులు చేయించి చివరికి ఇలాంటి అభియోగాలు మోపి అవమానపరచడం సరికాదన్నారు స్మశాన వాటికలు, రైతు వేదికలు, సెగ్రీ గేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, హరితహారం తో పాటు పలు ప్రభుత్వ పథకాలను అప్పటికప్పుడు గ్రామస్థాయిలో అమలు చేసేందుకు తాము నిర్విరామంగా శ్రమిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా గ్రామపంచాయతీ అభివృద్ధి ముఖ్యంగా పనిచేసిన తమపై ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల పరిషత్ ఉపాధ్యక్షులు రఘు ప్రసాద్, వెల్టూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, నాయకులు తిరుపతి రెడ్డి, వివేకానంద, కాంగ్రెస్ వెల్టూరు గ్రామ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, డీలర్ శ్రీనివాసులు, మన్నెంకొండ, లక్ష్మీనారాయణ, విక్రమ్ కుమార్ రెడ్డి, జానకి రాములు, రామచంద్రయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.