నిర్వాహకులు ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి -ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్

పెన్ పహాడ్, ఆగస్టు 30 (జనం సాక్షి)  :
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ మండల ప్రజలను కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలు నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని అన్నారు. మండపాల వద్ద ఉత్సవ కమిటీలు విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండపాల వద్ద దొంగతనాలు జరగకుండా కమిటీకి చెందిన వారు రాత్రి వేళల్లో పడుకోవాలని ఆయన అన్నారు. నిమజ్జనాలు సైతం అన్ని విగ్రహాలు ఒకే రోజు జరిగే విధంగా కమిటీలు సమన్వయం చేసుకోవాలని, గణేష్ ఉత్సవాలకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. వీలైతే గణేష్ మండపాలు ఉన్న వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని అన్నారు.