నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం

దిల్లీ(జ‌నం సాక్షి ): దేశంలో చారిత్రక మార్పునకు నీతిఆయోగ్‌ వేదిక అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ధాటించారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్రమంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు.

దేశంలో చరిత్రాత్మక మార్పును తీసుకొచ్చేందుకు ఈ నీతి ఆయోగ్‌ పాలకమండలి వేదికవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘సహకార, పోటీతత్వ సమాఖ్య దేశాన్ని అందించేందుకు ‘టీం ఇండియా’ పాలన అనేది ఓ సంక్లిష్ట సమస్య. దీనిపై పాలకమండలి సమక్షిస్తోంది. స్వచ్ఛభారత్ మిషన్‌, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి లాంటి కార్యక్రమాల కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారా విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7గా ఉందని.. దీన్ని రెండంకెల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మోదీ తెలిపారు. 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, వాటి నుంచి ప్రజలు లబ్ధిపొందుతున్న తీరును ప్రధాని వివరించారు. అంతేగాక.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ రాష్ట్రాలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.