నీరవ్‌ మోదీ దగ్గర ఆరు పాస్‌పోర్ట్‌లు!

న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగవేసి.. పరారీలో ఉన్న డైమండ్‌ జ్వలర్‌ నీరవ్‌ మోదీ దగ్గర ఆరు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులోనూ తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మొన్నటి వరకు లండన్‌లో ఉన్న నీరవ్‌ మోదీ.. ఇప్పుడు బెల్జియంలో ఉన్నట్లు తెలిసింది. అతని దగ్గర ఉన్న ఆరు పాస్‌పోర్ట్‌ల్లో.. రెండు పాస్‌పోర్ట్‌లు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. మరో నాలుగు పాస్‌పోర్ట్‌లు యాక్టివ్‌గా లేవని అధికారులు చెప్పారు. యాక్టివ్‌గా ఉన్న ఒక పాస్‌పోర్ట్‌లో నీరవ్‌ మోదీ పేరు పూర్తిగా ఉంది. మరో యాక్టివ్‌ పాస్‌పోర్ట్‌లో మాత్రం అతని పేరు సగం మాత్రమే ఉన్నది. అయితే రెండవ పాస్‌పోర్ట్‌ను భారత అధికారులు రద్దు చేశారు. ఇంటర్‌పోల్‌కు ఈ విషయాన్ని తెలియజేసినా.. అంతర్జాతీయ పోలీసు వ్యవస్థ అంత పటిష్టంగా లేదన్న విషయం స్పష్టమవుతున్నది. వివిధ దేశాల్లో నీరవ్‌ మోదీ పాస్‌పోర్టులను లీగల్‌గా బ్లాక్‌ చేయలేకపోతున్నారు.

————————-