నీ పోరాటం అద్వితీయం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారతీయులంతా నీ కుటుంబంలో ఒకరుగా నీ విజయానందాన్ని పంచుకుంటున్నారు’ అని రాష్ట్రపతి అభినందించారు ఇక సింధు అద్వితీయంగా పోరాడిందని, ఆమె సాధించిన విజయం చరిత్రాత్మకమని ప్రధాని అభివర్ణించారు. ‘‘సింధూ! నీ విజయం చిరస్మరణీయం. నీకు నా అభినందనలు’’ అని మోదీ ట్వీట్ చేశారు. సింధు తన అసమాన ప్రతిభతో దేశంలోని యువ భారతీయులందరి కొత్త ఆశలు వెలిగించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రశంసించారు.
‘‘నీవు సాధించిన రజత పతకం భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయి’’ అని అభినందించారు. ‘‘సింధు అద్భుత ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం, దేశానికి సదా స్మరణీయం. జై హింద్’’ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రశంసించగా, మహిళలకు సరైన అవకాశం లభిస్తే ఎంతటి ఘనత సాధించగలరో ఆమెతోపాటు సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ జాతికి చాటిచెప్పారని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. సింధు ప్రదర్శన ఛాంపియన్లకు తీసిపోదని, 125 కోట్ల హృదయాలను గెలుచుకోవడంతో పోలిస్తే స్వర్ణ పతకం విలువైనదేమీ కాదని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్
కొనియాడారు.