పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ధ్యం 

సీజనల్‌ వ్యాధులు మరోమారు విజృంభిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలతో ఇప్పుడు జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజలు స్థానికంగానే వైద్యం తీసుకుంటున్నారు. జ్వరాలు తగ్గకపోతే సవిూప ఆస్పత్రులకు వెళుతున్నారు. పారిశుధ్యం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఫలితం కనిపించడం లేదు. ఎక్కడిక్కడ మురుగునీరు రోడ్లపైనే ఇంటి చుట్టు పక్కల ప్రవహిస్తోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. పంచాఇతీల కాలపరిమిత దగ్గరపడడంతో సర్పంచ్‌లు కూడా పట్టనట్లుగా ఉన్నారు. తమకెందుకులే అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. తమ పదవీకాలం అయిపోయి నందున తామెందుకు బాధ్యత వహించాలన్న సమాధానం ఇస్తున్నారు. వచ్చే అధికారులు చూసుకుంటారని, వారికే చెప్పండన్న సమాధానం చాలాచోట్ల వస్తోంది.వైద్యఆరోగ్య, పంచాయతీరాజ్‌, గ్రావిూణ నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి చర్యలు తీసుకున్నా సమస్యలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణకు గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ఏమాత్రం సహకరించడంలేదు. త్వరలో సర్పంచుల పదవీకాలం ముగియ నున్నందునే వారు సహకరించడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డబ్బులు ఖర్చుపెట్టినా బిల్లులు వస్తాయో, రావనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి. అయితే వారు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సీజన్‌కు ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికార యంత్రాంగం ప్రకటించినా పలు జిల్లాల్లో వ్యాధులు ముసురుకుంటున్నాయి. అధికారులను అప్రమత్తం చేసినా వారు చాలాగ్రామల్లో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా గిరిజన గూడాల్లో పరిస్థితి యధాతథంగా ఉంది. సీజన్‌కు ముందే  గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యం మెరుగు పరచాలని, ఎక్కడికక్కడ కాలువల్లో పూడికతీసి మురుగు నీరునిల్వ లేకుండా చేయడం ద్వారా దోమలను నిర్మూలించాలని సూచించారు. దోమల వ్యాప్తికి కారణమైన లార్వాను సంహరించడానికి ఆయిల్‌బాల్స్‌ వేయాలని, అపరిశుభ్రత ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్‌, స్పే చేయాలని ఆదేశించారు. అయితే జిల్లాల్లో నామమాత్రంగానే చర్యలు చేపట్టారు. జిల్లాల్లో దోమల నివారణపై అధికార యంత్రాంగం గట్టి చర్యలే తీసుకుంది. అయితే పారిశుద్య లోపం పెద్ద శాంపంగా పరిణమించింది. అందరి అలసత్వం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం తో పాటు క్షేత్రస్థాయిలో వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. అయినా జ్వరాలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్రస్థాయి అధికారులు కూడా విషజ్వరాలు పెరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా ప్రతిపంచాయతీకి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నారు.  ప్రత్యేకాధికారులు వచ్చాక చూసుకుంటారులే అన్న నిర్లక్ష్యం ధోరణి కనిపిస్తోంది.  దీంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కూడా గ్రామస్థాయిలో ఎవరినీ ఏవిూ అనలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం గ్రామాల్లోకి వెళ్లి విషజ్వరాలపై జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహాలు ఇచ్చి వెనుతిరిగి వస్తున్నారు. అధికారులు లేదా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఏదో హడావిడి చేస్తున్నారు. ఉన్నతాధికారులు వస్తున్నప్పుడు మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుని మిన్నకుండిపోతున్నారు. నిధుల ఖర్చుపై కాకిలెక్కలు చూపి పారిశుధ్యం నిధులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో ఏమాత్రం పర్యవేక్షణ చేయడం లేదు. ఎవరికివారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వీరి నిర్వాకం వల్లే గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి విషజ్వరాలు

 

పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసి దోమలు పెరిగి జనం జ్వరాల బారిన పడుతున్నారు. అయినా  పంచాయతీలు, అటు మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిధులు మాత్రం కరిగిపోతున్నాయి. జ్వరాలు వచ్చి నప్పుడు మాత్రం ఆయా గ్రామాల్లో హడావుడిచేసి చేతులు దులుపుకుంటున్నారు.  ప్రతి పంచాయతీకీ ఒక ఫాగింగ్‌ మిషన్‌ చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఎపిలో చాలాచోట్ల దోమల నివారణ కోసం క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు కొనుగోలు చేసిన ఫాగింగ్‌ పరికరాలు అటకెక్కాయి. అలాంట ప్పుడు ఫాగింగ్‌ ఎందుకు చేయడంలేదని ప్రశ్నిస్తే  ఏదో సమాధానం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్లు మాత్రం విషజ్వరాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా వైద్య సిబ్బందిని గ్రామాలకు తరలించి వైద్యం చేయాల్సి ఉంది. గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయకపోతే ముందుముందు మరింతగా వ్యాధులు విజృంభించే అవకాశాలు లేకపోలేదు. ప్రధానంగా మలేరియా మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. గ్రామపాలన పడకేయకుండా చూడాలి. జిల్లాల్లో ఇప్పటికైనా ఉన్నతాధికారులు సీరియ్‌సగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే వ్యాధుల తీవ్రతకు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన దుస్థితి రావచ్చు. దీనిని నివారించ డానికి తక్షణం చర్యలకు ఉపక్రమించడం అత్యావశ్యక్యం.