పంజాబ్ లో సిద్ధు ఆవాజ్
పంజాబ్ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. ‘ఆవాజ్ ఎ పంజాబ్’ పేరుతో ఏర్పాటు చేసిన పొలిటికల్ ఫ్రంట్ ను ఈ నెల 9న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పర్గత్ సింగ్, బైన్స్ బ్రదర్స్ తో కలిసి ఈ ఫ్రంటుని ఏర్పాటు చేస్తున్నట్టు సిద్ధు ప్రకటించారు. పంజాబ్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి వ్యతిరేకంగా ఈ ఫ్రంట్ పనిచేస్తుందని చెప్పారు.
ఇటీవల బీజేపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సిద్ధు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ పార్టీకి కూడా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి పంజాబ్ లో లేకపోవడంతో సిద్ధు వైపు చూశారు. సిద్ధు మాత్రం కొత్త ఫ్రంట్ ఏర్పాటు వైపే మొగ్గు చూపారు.