పత్తి మద్ధతు ధర కోసం కేంద్రాన్ని నిలదీస్తాం
– వరంగల్ విజయం మా బాధ్యత పెంచింది
– ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): పత్తికి మద్ధతు ధర కోసం కేంద్రంపై నిలదీస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మద్ధతు ధర కోసం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు భారీ విజయాన్ని కట్టబెట్టడంతో తమ ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందనిఈ సందర్భంగా కడియం శ్రీహరి పెర్కొన్నారు. వరంగల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా టీఆర్ఎస్కే పట్టం కట్టారని, ఈ విజయంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో సైనిక పాఠశాల ఏర్పాటుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేశారు. పత్తి రైతుల సమస్యలపై డిసెంబర్ 2న దిల్లీలో ప్రధానిని కలిసి వివరించనున్నట్లు కడియం తెలిపారు. పత్తికి మద్దతు ధర, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయి శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలందరు ప్రధాని మోడీని కలుస్తామని చెప్పారు. వరంగల్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర, ఎస్సీ వర్గీకరణ, కరవు మండలాలకు సాయం ప్రకటించాలని ప్రధానిని కోరనున్నట్లు చెప్పారు. వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని కడియం తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు