పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి.

వచ్చే అక్టోబరు 16 న జరిగే పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షకు సంబంధించి పరీక్షా క్రేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష కేంద్రాలలో వసతి సౌకర్యాలపై ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల నిర్వాహకులతో ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‌, వచ్చే అక్టోబరు 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు గాను జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినట్లు, వీటి ద్వారా 3645 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నట్లు తెలిపారు. 62 కేంద్రాలకు సంబంధించి 18 ప్రభుత్వ, 17 ప్రయివేటు కలిపి మొత్తం 35 పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాల ఏర్పాటు లేనందున వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి అవసరమున్న చోట దాతల ద్వారా ఏర్పాటు చేసుకోవాలని, సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా పరీక్షలు సాఫీగా జరుగుతాయని, ప్రస్తుతం నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షనే కాకుండా ఇతర పరీక్షల నిర్వహణకు కేంద్రాలలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని, ముఖ్యంగా పరీక్షా కేంద్రాలలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, ఎసిపి వెంకటరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.