పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై అమెరికాతో భారత్ చర్చలు

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయమై అమెరికాతో జరిపిన చర్చల్లో సుంకాలను (టారిఫ్‌లు) గురించిన అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని భారత ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం చేసింది. ఈ నెలలో జరిగిన ఈ చర్చల సందర్భంగా టారిఫ్‌ల గురించి మాట్లాడినట్లు అమెరికా కోర్టులో ట్రంప్ బృందం చేసిన వాదనలను భారత్ తోసిపుచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాతో భారత ప్రతినిధులు చర్చలు జరిపారని, ఈ చర్చల సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన సుంకాలను గురించిన అంశం కూడా చర్చకు వచ్చిందని ట్రంప్ బృందం అమెరికా కోర్టులో వాదనలు వినిపించింది. “పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాతో జరిగిన చర్చలు పూర్తిగా ఆ అంశానికే పరిమితమయ్యాయి. ఈ చర్చల్లో సుంకాలను గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఇది పూర్తిగా అవాస్తవం” అని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, గతంలో చెప్పినట్లుగానే సుంకాలను గురించిన అంశం ఈ చర్చల్లో భాగం కాదని పునరుద్ఘాటించాయి.భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు, సుంకాలను విధించే అంశాలు వేరే వేదికలపై చర్చిస్తామని, వాటికి, పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ చర్చలకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రంప్ బృందం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నమేనని భారత అధికారులు పేర్కొన్నారు.

తాజావార్తలు