పాక్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు

narendramodi1రిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అంశాలనైనా ఎదుర్కోవడానికి సైనిక దళాల సంసిద్ధత గురించీ వివరాలు తెలుసుకున్నారు. పాక్ సైన్యం గత రెండు నెలల నుంచి తెరిపి లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో సైనిక దళాల సంసిద్ధతపై త్రివిధ దళాధిపతులతో మోదీ చర్చించటం గమనార్హం. సైన్యాధ్యక్షుడు జనరల్ దల్బీర్ సుహాగ్, నావికాదళం అధిపతి ఆడ్మిరల్ సునీల్ లాంబా, వైమానికాదళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహాలతోపాటు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమీక్షకు హాజరయ్యారు. పాకిస్తాన్ గత రెండు నెలల్లో దాదాపు 110 సార్లు ఎల్‌వోసి, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ రేంజర్లు సైనిక పోస్టులతోపాటు పౌరుల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ బాంబులు కురిపిస్తోంది. అవసరమైతే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాలనేది కూడా చర్చకు వచ్చిందనే మాట వినిపిస్తోంది. సైన్యం సంసిద్ధత, ఆయుధ నిల్వలు, వాటి అవసరాలు, ఇతర అంశాలపై త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన అనంతరం పాక్‌కు బుద్ది చెప్పేందుకు ఏంచేయాలనే అంశంపై పలు ప్రతిపాదనలు చేసినట్టు రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు.