పారాసెయిలింగ్ చేస్తూ వ్యాపారవేత్త మృతి
పారాసెయిలింగ్ చేస్తూ కిందకు జారిపడి ఓ వ్యాపారవేత్త మృతి చెందిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. కోయంబత్తూర్లోని ఓ మెడికల్ కాలేజ్ యానివర్శరీ సందర్భంగా పారాసెయిలింగ్ ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.500 టికెట్ కూడా పెట్టింది. పారాసెయిలింగ్ అంటే ఆసక్తి ఉన్న వ్యాపారవేత్త మల్లేశ్వరరావు ఓ టికెట్ కొని ఈ సాహసానికి సిద్దమయ్యాడు. దాదాపు 60 అడుగులు.. అంటే ఐదంతస్తుల బిల్డింగ్ ఎత్తు నుంచి కిందకు దూకాడు.కిందకు దిగే క్రమంలో తాను కట్టుకున్న సేఫ్టీ రోప్ గ్లైడర్కు సరిగ్గా అటాచ్ చేయకపోవడంతో మధ్యలోనే అది తెగిపోయి 60 అడుగుల ఎత్తునుంచి కిందపడ్డాడు మల్లేశ్వరరావు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే మల్లేశ్వరరావు మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు పోలీసుల అధికారులు. పారాగ్లైడింగ్కు సంబంధించిన వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పిన పోలీసులు ఘటనా స్థలంలో ఒక్క అంబులెన్స్ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.