పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై భాజపా పోరు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టబోతున్నాయి. భాజపా నేత రవిశంకర్‌ప్రసాద్‌ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.  ఈ సమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయేలోని ఇతర పార్టీలతో చర్చించి పార్లమెంట్లులో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారుజ నితిన్‌ గడ్కరీ విషయానికి వస్తే వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ సవ్యంగానే ఉన్నాయని, వాటి వల్ల విదర్భ ప్రాంత రైతులు లబ్ధిపొందుతున్నారని రవిశంకర్‌ అన్నారు. హర్యానా, రాజస్థాన్‌లలో భూములు పొందిన  రాబర్ట్‌ వాద్రాపై ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌ లావాదేవీలు, కోల్‌బ్లాక్‌ కేటాయింపుల్లో మన్మోహన్‌సింగ్‌ పాత్ర, ఎయిర్‌సెల్‌- మ్మాక్సిస్‌ డీల్‌, షుంగ్లూ కమిటీ నివేదిక ఏ మైంది… తదితర అంశాలన్నీ తాము సభలో ప్రస్తావించనున్నట్లు రవిశంకర్‌ప్రసాద్‌ తెలియజేశారు.