పాలస్తీనా,గాజాకు పట్టిన గతే కాశ్మీర్‌కు పట్టిస్తారు

` ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదు
` నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా
న్యూఢల్లీి,డిసెంబర్‌26(జనంసాక్షి) జమ్మూకాశ్మీర్‌కు గాజా`పాలస్తీనా పరిస్థితులు తప్పవంటూ..జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ అంశంలో పాకిస్థాన్‌తో మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని ఆరోపించారు. ఒకవేళ ఈ అంశంలో చర్చలు ప్రారంభించకపోతే గాజా, పాలస్తీనా తరహా పరిస్థితులను ఎదుర్కోవాలని వస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, లేకుంటే మన పరిస్థితి గాజా, పాలస్తీనాలా తయారవుతుందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాలేదని ఫరూక్‌ అబ్దుల్లా ఆరోపించారు. ఇది గతంలో కంటే ఎక్కువగా జరుగుతోంద న్నారు. ముస్లింలు, హిందువులు మనం ఒకరికొకరు శత్రువులమని భావించేంతగా ద్వేషం పెరిగిపోయింద న్నారు ఆయన. పాకిస్థాన్‌లో నవాజ్‌ షరీఫ్‌ వజీర్‌ ఆజం కాబోతున్నాడు. ఆయన చర్చలకు సిద్ధమైతే మనం ఎందుకు చేయకూడదన్నారు ఫరూక్‌ అబ్దుల్లా. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రకటనను ప్రస్తావించిన ఫరూక్‌ అబ్దుల్లా.. స్నేహితులను మార్చవచ్చు, పొరుగువారిని మార్చలేరు. మన పొరుగు వారితో స్నేహంగా ఉంటే, ఇద్దరూ పురోగమిస్తారన్నారు. వారితో శత్రుత్వంతో ఉంటే, మనం త్వరగా అభివృద్ధి చెందలేమన్నారు ఫరూక్‌ అబ్దుల్లా. నేటి యుగంలో యుద్ధం అనేది ఒక ఆప్షన్‌ కాదని మోదీజీ స్వయంగా చెప్పారన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.