పెద్ద స్కాం వేశారు – కేజ్రీవాల్
పెద్ద నోట్లు రద్దు చేయడం పెద్ద కుంభకోణమని, ఈ రద్దును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశ పెట్టడంపై కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు పేరుతో పెద్ద స్కాం నడుస్తోందని ఆరోపించారు. మోదీ నోట్ల రద్దు ప్రకటించడానికి ముందే భాజపాతో పాటు ఆ పార్టీ సన్నిహితులకు దీని గురించి తెలుసని.. వారంతా ముందుగానే జాగ్రత్తపడి డబ్బును మార్చేసుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే పంజాబ్కు చెందిన ఓ భాజపా నేత ట్విట్టర్లో రూ.2000 నోట్ల కట్టను పోస్ట్ చేశారని కేజ్రీవాల్ అన్నారు. మోదీ ప్రకటించిన ఈ విధానం వల్ల నల్లధనం నియంత్రించడమేమీ కుదరదని, కేవలం డబ్బు చేతులు మారుతుందని అన్నారు.