పెరిగిన పెట్రోల్ ధరలు
– శనివారం అర్థరాత్రి నుంచే అమలు
– నెలలో మూడు సార్లు పెరిగిన ధరలు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్కు 89 పైసలు, డీజిల్ లీటర్కు 86 పైసలు చొప్పున పెంచారు.. శనివారం ఆర్థరాత్రి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ప్రకటించింది. పెట్రోల్ ధరలు పెరగడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. సెప్టెంబర్ 1 నుంచి ఈ ధరలు పెరగడం ఇది ఆరోసారి. చివరిసారిగా అక్టోబర్ 16న పెట్రోల్ ధరలు పెరిగాయి. గత ఐదుసార్లు పెంపుతో పెట్రోల్ ధర లీటర్పై రూ.6.36 మేర పెరిగింది. తాజా పెంపుతో రెండు నెలల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 7.53 పెరిగింది. డీజిల్ విషయానికి వస్తే నెల వ్యవధిలో దీని ధర మూడు సార్లు పెరిగింది. నెల రోజుల్లో డీజల్ లీటర్కు రూ. 3.90 పెరిగింది. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ వంటి అంశాల ఆధారంగా ధరలు పెంచినట్లు ఐఓసి తెలిపింది.